Tuesday, May 5, 2020

పంచారామ క్షేత్రాలు


                                                          పంచారామములు 


                                      శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే

శివ కేశవులకి భేదం లేదు.శివుడే విష్ణువు,విష్ణువే శివుడు.శివుడు ఎక్కడ వుంటాడో అక్కడ విష్ణువు వుంటాడు.విష్ణువు వున్నచోటే శివుడు కొలువై వుంటాడు.
శివ కేశవుల ఏకత్వాన్ని తెలియచేసే పవిత్ర క్షేత్రౌ లు మన ఆంధ్రప్రదేశ్ లో పంచారామాలు గా విలసిల్లుతున్నాయి.శివస్య హృదయం విష్ణుర్విర్ణోశ్చ హృదయం శివః అనగా శివుని హృదయం లో కొలువై వుండేది విష్ణువే అలానే విష్ణువు హృదయం ఆవాసం గా చేసుకుని  వుండేవాడు శివుడు.ఈ ఆబేదాన్ని మనకి చెప్పడానికి  ఈ పంచారామాలు.
పంచ అంటే ఐదు ,ఆరామం అంటే కొలువై వుండే స్థలం.ఈ ఐదు ప్రదేశాలలో సాక్షాత్తు శివుడు కొలువైవున్న  క్షేత్రాలు .ఈ క్షేత్రాలలో శివుడు కొలువుతీరి  పూజలు అందుకుంటే ఈ ఐదు క్షేత్రాలలో విష్ణువు  క్షేత్ర పాలకుడు గా వున్నాడు.ఇంకా అద్బుతమైన విశేషం యేమిటంటే ఈ ఐదు శివలింగాలు ఒకే లింగం నుండి ఉద్భవించాయి.
మన ఆంధ్రప్రదేశ్ లో వున్న ఈ పంచారామాల గురించి చాలా కథలు ప్రాచుర్యం లో వున్నాయి.అందులో ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి ఒకటి శ్రీనాధుడు రచించిన భీమేశ్వర పురాణం  లో ఈ పంచారామాల  ఉద్భవం  గురించి వున్న ఒక కథ మరియొకటి స్కంద పురాణం తారకాసుర వధ ఘట్టం లో ఈ పంచారామల  పుట్టిక గురించి చెప్పబడింది.
మొదటిగా మన శ్రీనాధ కవి సార్వభౌముడు రచించిన బీమేశ్వర పురాణము ప్రకారం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహా విష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంపిణీ  చేసినప్పుడు త్రిపురాసురులు  అనే రాక్షసులు పంపకం లో తమకు అన్యాయం జరిగింది అని అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కొరకు ఘోరమైన తపస్సు చేస్తారు. ఆ త్రిపురాసురుల తపస్సుకి మెచ్చిన శివుడు  వారికి అనేక విదములైన వరములను ప్రసాదిస్తారు.ఆ  శక్తి తో రాక్షసులు  దేవతలను అనేకరకాల బాధలకి గురి చేస్తారు.వారి దుర్మార్గాలు భరించ లేక దేవతలు అందరూ కలిసి ఆ దేవ దేవుడు అయిన శివుడిని రక్షించమని వేడుకుంటారు.దేవతల మొర ఆలకించిన మహాదేవుడు త్రిపురాంతకుడి రూపంలో తన పాశుపతంతో రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు.మహాశివుని యొక్క ఈ రుద్ర రూపాన్ని త్రిపురాంతకుడుగా పూజిస్తారు.కానీ ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ లింగాన్ని మహదేవుడు ఐదు ముక్కలుగా చేదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను దేవతలకు పంచిపెట్టడం జరిగింది.అలా పంచబడిన ఐదు లింగ భాగాలని  దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు గా  శ్రీనాధుని  బీమేశ్వర పురాణము  లో చెప్పబడింది.
మరోయొక గాధ స్కంద పురాణం లో వుంది అనుకున్నాము కదా.స్కంద పురాణం  లో  తారకాసుర వధ ఘట్టం ప్రకారం హిరణ్య కశిపుడి మనుమడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుకుంటాడు. రాక్షస  ప్రవృత్తి సహజముగా వున్న తారకాసురుడు  శివుడు ప్రసాదించిన వరముల కారణముగా ముల్లోకాలను బాధించటం మొదలు పెడతాడు. తారకాసురుని ధాటికి తట్టుకోలేని దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా,  ఆ శ్రీహరి తారాకసురుడు శివ భక్తుడు  నేను వధించలేను కానీ శివపార్వతుల తనయుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అన్న ఉపాయాన్ని  సూచిస్తాడు.అప్పుడు దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. అలా తారకాసురుని సంహరించేందుకు పార్వతీ గర్భాన జన్మిస్తాడు కుమారస్వామి. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి దిగుతాడు. కానీ ఎన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించినా  ,ఆఖరికి శక్తి అనే ఆయుధము తో  యెన్ని సార్లు  ఆ అసురుని శరీరాన్ని ముక్కలు చేసిన  అవి  మరలా అతుక్కుపోతువుంటాయి .ఏమి చెయ్యాలో తెలియని స్తితిలో వున్న షణ్ముఖినికి  శివుడు ప్రత్యక్షమై తారుకుని కంఠం లో నా ప్రాణలింగం వున్నంత వరకు అతనికి మరణం సంభవించదు అందుకని ఆ  ఆత్మలింగాన్ని ముక్కలుగా ఛేదించాలి అని చెపుతారు.అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రం తో  ఆ ఆత్మలింగాన్ని ఐదు ముక్కలుగా  ఛేదించగా  ఆ ఆత్మలింగం గోదావరి, క్ర్సిష్ణ నది తీరాలలో ఐదు చోట్ల పడింది . ఆ అయిదు ప్రాంతాలే పంచారామాలుగా పసిద్దిగాంచాయని స్కంద పురాణం చెపుతోంది.అంతే కాక ఓంకార నాదం తో అవి ఏకం అవుతుండగా విష్ణుమూర్తి ఆదేశం మేరకు ఆ లింగ శకలాలు పడ్డ చోట దేవతలు వెనువెంటనే  లింగాలు ప్రతిష్టించి ఆలయాలు నిర్మించారని అని కూడా పురాణాలు చెపుతున్నాయి.అవే పంచారామ క్షేత్రాలుగా పిలువబడుతున్నాయి. నాలుగు పంచారామాలు గోదావరి తీరం లో, ఒకటి  కృష్ణా తీరం లో వున్నాయి అవి వరుసగా
దక్షారామము- భీమేశ్వరుడు- ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా
కుమారభీమారామం – భీమేశ్వరుడు- సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా
క్షీరారామము- రామలింగేశ్వరుడు - పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా
భీమారామము- సోమేశ్వరుడు - భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
అమరారామము- అమరేశ్వరుడు - అమరావతి, గుంటూరు జిల్లా


ఒక్కో పంచారామ  క్షేత్రం గురించి ఇంకా ఆక్షేత్రం కి దగ్గరలో వున్న దర్శనీయ ప్రదేశాల గురించి  వరుస బ్లాగ్ లలో విపులంగా చెప్పాలనుకుంటున్నాను .
నా తరువాతి బ్లాగ్ లో మొదటిగా మనం సామర్లకోట లో వున్న  కుమారభీమారామం  గురించి  తెలుసుకుందాము.