Wednesday, October 17, 2018

యాత్ర 01 -శ్రీకాకుళం -అరసవల్లి



యాత్ర

ఈ మద్యన అందరికి వయస్సు తో సంబంధం లేకుండా ఏదో ఒక చింత.పిల్లల నుండి పెద్దల వరకు  ఉరుకులు పరుగుల జీవితం.పూర్వం వాళ్ళకి ఇంత హడావిడి జీవితం వుండేది కాదు.ఇప్పుడు ఉన్నంత రవాణా సదుపాయం కూడా లేదు.అయిన పూర్వం వాళ్ళు తీర్ధయాత్రలు చేసేవారు.దూరం తక్కువ అయిన ఎక్కువ అయిన  వెళ్ళటానికి ప్రయాస  ఎక్కువగానే  వుండేది అందుకే అప్పట్లో ఒక నానుడి వుండేది కాశీ కి వెళ్ళిన  కాటికి వెళ్ళిన ఒక్కటే అని .కానీ ఇప్పుడు అలా కాదు రవాణా సదుపాయం ,వసతి సౌకర్యం కూడా బానే వుంది .కాని ఈ కాలంలో దానికి కూడా  మనలో కొంతమంది సమయం కేటాయించలేకపోతున్నాము. మనం దూరం గాఉన్నప్రదేశాలకి కాకపోయిన దగ్గరిలో వున్న  సందర్శక స్థలాలిని ఒకరోజులో చూసి రావొచ్చు.లేదా మనం మన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వల్ల తో కలిసి ఆ దగ్గరిలో వున్న చూడవలసిన మరియు సందర్శించవలసిన ప్రదేశాలకి వెళ్లవచ్చు.మన చుట్టూనే మనకి తెలియని అధ్బుతమైన ప్రదేశాలు వుండి వుండవచ్చు.అది ఆలయాలలు  కావొచ్చు లేదా సుందర ప్రదేశాలు కావొచ్చు,మన హడావిడి జీవితం లో ఒకరోజు  మనకి దగ్గరి లో వున్న  ఒక మంచి  ప్రదేశం కి  వెళితే మన మనసుకు ఆహ్లాదం మరియు పిల్లలకి  కొంచెం సరదా మరికొంచెం  కొంచెం జ్ణానం.
ఈ యాత్ర  క్రమం లో మన ఆంధ్రప్రదేశ్ లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.  అవి పుణ్య స్థలాలు కావొచ్చు లేదా చరిత్రాత్మక స్థలాలు కావొచ్చు వాటి విశేశాలు మరియు వివరాలు  జిల్లాల వారీగా తెలియజేస్తాను.ఇందులో ఎక్కువగా స్వయంగా చూసి పొందుపరచినవి మరికొన్ని స్నేహితుల ద్వారా తెలుసుకొన్నవి మరియు పర్యాటక శాఖ వారి పుస్తకాల ద్వారా తెలుసుకున్నవి.ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే తెలియజేయగలరు.సరిచేసుకుంటాను.
శ్రీకాకుళం  

ఈ సిరీస్ ని  శ్రీకాకుళం  జిల్లా తో ప్రారంభిస్తాను.

శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ కు ఈశాన్య దిక్కున ఉంది. ఉత్తరాంధ్ర లో ఒక జిల్లా.ఈ జిల్లా 1950 ఆగష్టు 15  శ్రీకాకుళం  కేంద్రంగా శ్రీకాకుళం  జిల్లా గా ఏర్పడింది. శ్రీకాకుళం పేరు వెనుక ఒక కధ ప్రచారం లో వుంది. ఈ ప్రాంతం నైజాము ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసిమూటకట్టిఆమూటను సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలనఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్" అయిశ్రీకాకుళంగా స్థిరపడింది అని చెపుతారు.
శ్రీకాకుళం ఒకప్పుడు చరిత్రాత్మకం గా బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అని అని ఇక్కడ వున్న ఆలయాలు మరియు లభించిన ఆధారంలను బట్టి చెప్పవచ్చు.ఈ ప్రదేశం లో ఒకప్పుడు బౌద్ధ మతం బాగా విరిసిల్లినది అని ఇక్కడ  లభించిన శాలిహుండం,జగతి మెట్ట వంటి బౌద్ధారామలను బట్టి చెప్పవచ్చు.ఇక్కడ వున్న హిందూ దేవాలయాలు అన్నీ కళింగ నిర్మాణ శైలి లో కనిపిస్తాయి. శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు కళింగ సామ్రాజ్యం లో భాగం గా  వుండేదని చెప్పవచ్చు.

శ్రీకాకుళం లో చూడవల్సిన ప్రదేశాలు
1.సూర్య దేవాలయం -అరసవల్లి
2.శ్రీ కూర్మనాధ దేవాలయం- శ్రీకూర్మం
3. శ్రీ ముఖ లింగేశ్వర దేవాలయం -శ్రీ ముఖ లింగం
4. పాతాళ సిద్దేశ్వరాలయం – శ్రీకూర్మం 
5. సంగమేశ్వర దేవాలయం -సంగం
6.శివాలయం రావివలస
7.వాసుదేవ దేవాలయం -మందస
8.బారువ సముద్ర తీరం బారువ
 సూర్యదేవాలయం అరసవల్లి


ఉషోదయ కిరణాలతో సమస్త  ప్రాణ కోటికి  జీవాధార శక్తి ని ప్రసాదించే భాస్కరునుకు నిత్యం పూజలు  జరిగే ఆలయం అరసవల్లి  శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం.ఈ ఆలయ ప్రస్తావన మనకు పద్మపురాణం లో కనిపిస్తుంది.పద్మపురాణం ఈ ఆలయలం లో వున్న విగ్రహాన్ని కశ్యప మహర్షి  ప్రతిష్టంచారని  మరియు ఇంద్రుడు  మొదట ఆలయాన్ని నిర్మించారని చెపుతోంది.అరసవల్లి ని ఒకప్పుడు హర్ష వల్లి అని అనేవారని అదే కాలక్రమేణ అరసవల్లి అయిందని అంటారు.
ఈ ఆలయానికి పురాణాలలోనే కాకుండా చరిత్ర పరం గా కూడా మంచి విశిష్టత వుంది అని ఆలయ పరిసరాల్లో లో దొరికిన శాసనాల వలన తెలుస్తున్నది.చరిత్ర ప్రకారం ఈ ఆలయం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది.ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయం లో ఇప్పిలి అక్కన్నసూరప్ప అనే సోదరులు రాజు గారిని కలిసి తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని,వారికి శ్రీ ముఖలింగం వస్తుండగా వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంధం దొరికిందనిఆ గ్రంధం లో సూర్య భగవానుని పూజ విధానాలు వున్నాయని చెప్పారట.ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించారట.ఇప్పటికి వారి వారసులే ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.
 








స్థల పురాణం ప్రకారం ఒకసారి ఇంద్రుడు అరసవల్లి లో వున్న కోటేశ్వరస్వామిని దర్శించుకోవటానికి వచ్చారట.కానీ అప్పటికే దర్శన సమయం దాటిపోవటం వలన ద్వారపాలకుల గా వున్న నందీశ్వరుడు,శృంగేశ్వరుడు మరియు బృంగేశ్వరుడు ఇంద్రుడిని వారించారు.అప్పుడు ఇంద్రుడు వారితో ఘర్షణకి దిగగా నందీశ్వరుడుకి కోపం వచ్చి కొమ్ములతో ఇంద్రుడిని దూరంగా విసిరేశారు.ఇంద్రుడు పడిన స్థలమునే ఇంద్ర  పుష్కరిణి అంటారు.కానీ ఇంద్రుడు అన్నీ శక్తులు కోల్పోయి సూర్య భగవానుడను ప్రార్ధించగా ప్రత్యక్షమై ఇంద్రుడు పడిన చోట  వజ్రాయుధముతో త్రవ్వమని చెప్పగా ,త్రవ్విన చోట సూర్యభగవానుని విగ్రహం  తో పాటు ఉష,ఛాయా మరియు పద్మిని విగ్రహాలు దొరికాయి.ఇంద్రుడు ఆ విగ్రహాలన్నీ ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారని  తిరిగి తన శక్తులను పొందారని పురాణం చెపుతోంది.
ఈ ఆలయ నిర్మాణం దక్షిణాది ద్రావిడ నిర్మాణ శైలి లో కాకుండా  కళింగ  నిర్మాణ శైలి లో వుంటుంది.ఈ ఆలయ నిర్మాణం ప్రత్యేకత  యేమిటంటే సంవత్సరానికి రెండు సార్లు సూర్య కిరణాలు గర్భగుడి  లో  వున్న స్వామి మూల విరాట్టు పాదాలను తాకుతాయి.ప్రతి రోజు తొలి సూర్య కిరణాలు ధ్వజస్తంభం  నుండి  సుదర్శన ద్వారం మద్యనుండి గర్భగుడి లోని స్వామి శిరస్సుని సృశిస్తాయి.ఆదివారములలో మరియు మాఘమాసం,కార్తీక ఆదివారంలలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు.

ఇంద్ర  పుష్కరిణి 


ఆలయంను కు ఎదురుగా  ఇంద్ర పుష్కరిణి వుంటుంది. తల నీలాలు మొక్కు తీర్చుకున్న భక్తులు ఈ పుష్కరిణి లో స్నానం చేసి స్వామి ని దర్శించుకుంటారు.ఈ ఆలయానికి రామలింగేశ్వర స్వామి క్షేత్ర పాలకుడిగా వున్నారు. స్వామి వారి మూల విరాట్టు సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి ,మీసాలు తో వున్న ముఖముతో,కమలపు రేకులతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ,ఉషచాయా దేవేరులతో కూడుకొని ఉంటుందివిగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులగు పింగళదండులతో పాటు సనక సనందాది ౠషుల విగ్రహాలు వుంటాయి.స్వామిని దర్శించుకుని బయటికి వచ్కే మార్గం లో అమ్మవారు వుంటారు.వారిని దర్శించుకొని గుడి వెలుపలికి వచ్చే మార్గం లో ఆలయానికి సంబందించిన మూడు శాసనాలు వుంటాయి.

అరసవల్లి  శ్రీకాకుళం పట్టణానికి సుమారుగా  5 కి మీ లో దూరం లో వుంటుంది. శ్రీకాకుళం నుండి బస్ మరియు ఆటొ లు  లభిస్తాయి.ఇక్కడి నుండి 8 నుండి 10 కి మీ లో దూరం లో శ్రీ కూర్మం వుంది.అరసవల్లి  మరియు శ్రీకూర్మం ఒకరోజు లో దర్శించుకోవచ్చు.

గమనిక:  ఈ నెల  అక్టోబర్ 11   సంభవించిన  తిత్లీ తూఫాన్ కారణంగా శ్రీకాకుళం చాల నష్టపోయింది. అక్కడ ప్రజలు నిలువ నీడ లేకుండా  అయిపోయారు. మనిషిని మనిషి మాత్రమే ఆదుకోగలరు . మనకు చేతనైనంత  సాయం చేద్దాం  చేయూతనిద్దాం. 
శ్రీకాకుళజిల్లా  వాసులందరికి మనం వారితో ఉన్నాం అని వారికీ ధైర్యానిద్దాం . 
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

1 comment:

  1. చాలా బాగుంది లక్ష్మీ

    ReplyDelete