Friday, October 19, 2018

యాత్ర 05-శ్రీకాకుళం-శివాలయం – రావివలస



శివాలయం రావివలస

మల్లికార్జునస్వామి వారి లింగం 
శ్రీకాకుళం జిల్లాలో మరొక చూడవల్సిన ప్రదేశం రావివలస లోని శివాలయం.ఇక్కడ స్వామి మల్లికార్జునుడిగా కొలవబడుతున్నాడు.ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని కూడా అంటారు.ఈ ఆలయ ప్రత్యేకత యేమిటంటే అన్నీ చోట్ల శివుని కి ఆలయాలు వున్నాయి.కానీ ఈ మల్లికార్జునుడు కి  ప్రత్యేకించి ఎటువంటి ఆలయం లేదు.అంటే ఇక్కడ ఆలయానికి తలుపులు ,పైకప్పు లాంటివి ఏమి ఉండవు .స్వామి వారు ఎండ కి ఎండుతూ వాన కి తడుస్తూ ఆరు బయటే  కొండ మీద కొలువై ఉన్నారు.స్వామి పల్లె ప్రజల కొంగు బంగారమై,పిలిస్తే పలికే దైవం గా ఇక్కడ ఉంది పూజలు అందుకుంటున్నారు.
కొండ పై కొలువున్న ఈ శివలింగం చాలా పెద్దది అంటే సుమారుగా ఇరయై అడుగుల పైనే ఉంటుంది.ఇంత పెద్ద శివలింగం దేశంలో ఎక్కడ లేదు.ఈ ఈ ఆలయనికి వందల సంవత్సరాల చరిత్ర వుంది.ఈ ఆలయాన్ని  కార్తీక కైలాసం అని కూడా అంటారు.
స్థల పురాణం ప్రకారం  త్రేతా యుగంలో శ్రీరాముల వారు రావణ సంహార అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచరగణంతో విడిది చేసారు. అనుచరగణంలో ఉన్న సుశేణుడు అనే దేవవైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషద, మూలికా వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు. కాని చుట్టూ ఔషదాలున్నా అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండటం అతనిని  చాలా ఆశ్చర్యపరచింది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య ఈతిబాధల నివారణార్ధం తను ఏదైనా చేయలని తలంచి,బొందితో కైలాసం చేరుకోవాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి కూడా ఇదేమంచి ప్రదేశంగా అతనికి అనిపించింది. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకొంటున్నట్లుగా చెప్పాడు. శ్రీరాముడు అతని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార, అనుచరులతో తరలి వెళ్ళిపోయారు.తరువాత సుశేణుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయనారంబించాడు. కొంతకాలం తరువాత రాముల వారు సుశేణుడు ఎలా ఉన్నాడో క్షేమసమాచారాలు చూసిరమ్మని హనుమంతుల వారిని పంపించారు. హనుమంతులవారు సుమంచ పర్వతప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుశేణుడు కనిపించలేదు కాని అతని కళేబరం కనిపించింది. సుశేణుడు తపమాచరిస్తూ శివసాయుజ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరచి సుశేణుని కళేబరాన్ని అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరకిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళతాడు.
అప్పుడు సీతారాములు లక్ష్మణ సమేతంగా హనుమంతుని తో పాటు సుశేణుడు తపస్సు చేసిన సుమంచ పర్వతానికి వచ్చారు.రాముల వారికి సుశేణుడు శరీరం చూపించటానికి జింక చర్మ ఎత్తి చూడగా  సుశేణుడు శరీరం బదులు శివలింగం దర్శనం ఇచ్చింది.అప్పుడు సీతారాముల వారు అక్కడ కోనేటి లో స్నానమాచరించి ఆ శివలింగానికి పూజించుట ప్రారంబించగానే శివలింగం పెరుగుతూ వచ్చింది.అదే సమయంలో ఔషద, మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ గాలి గా మారి,ఆ గాలి వీచినంత మేర అందరికీ ఉన్నఅనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టుకుపోవటం,ఇంకా ఒకరకమైన శక్తి తేజస్సు రావడం గమనించారు.శ్రీ రాముడు గుడి కడదామని అనుకున్నా లింగం అలా పెరుగుతూ పోవటం తో గుడి కట్టే ఆలోచనని విరమించుకున్నారట.అప్పటి నుండి లింగం అలా పెరుగుతూనే ఉంది. మల్లెపూలతో పూజింపబడి జినంతో కప్పబడి ఉన్నందున స్వామి మల్లికాజీన స్వామి గా పిలవబడ్డారు.కాలక్రమేణ మల్లికార్జున స్వామి గా మార్పుచెందిదని క్షేత్రపురాణం చెపుతోంది.ఈ శివలింగానికి ద్వాపర యుగం లో పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి సీత కుండంగా పిలవబడే కోనేరులో స్నానమాచరించి  స్వామి వారిని సేవించి ఇక్కడ ఉన్న గుహలో కొంత కాలం వున్నట్టు క్షేత్రపురాణం చెపుతోంది.

సీతాకుండం 
ఈ క్షేత్రం పురాణ కాలం నుండే మహా  శివక్షేత్రంగా ప్రసిద్దికెక్కింది. కార్తీక మాసంలో ఇక్కడ అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు మరియు శివరాత్రి పర్వదినాన ఆలయానికి భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని లింగోద్భావాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి, కార్తీక సోమవారం నాడు ఈక్షేత్రంలో అభిషేక, ఉపవాస, జాగరణలు ఎవరు చేస్తారో వారి మనోవాంఛలు సిద్ధిస్తాయని,ఈ స్వామిని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యంగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం. 

1870 లో స్వామి కి టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ ఆలయాన్ని నిర్మించగా అది తొందరలోనే శిధిలమై పోయింది,భక్తులు తిరిగి ఆలయ నిర్మాణానికి పూనుకొనగ స్వామి వారు కలలో కనిపించి తనకు గుడి వద్దు అని ఆరుబయట ఉండటమే తనకి ఇష్టమని ఎండకు,వానకు తడిచి ఎండల మల్లికార్జునుడి గా ప్రాచుర్యం పొందుతానని చెప్పారు.
ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయం శ్రీకాకుళం నుండి సుమారుగా 56 KM దూరంలో  టెక్కలి కి 5 km దూరంలోఉంది. శ్రీకాకుళం నుండి టెక్కలి కి ప్రతి 15 నిమిషాలకు బస్సులు ఉన్నాయి.అక్కడి నుండి అనగా టెక్కలి నుండి రావివలస కు ఆటొలు ఉంటాయి.ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి వుంచుతారు.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 


2 comments:

  1. చాలామందికి శ్రీకాకుళం గురుంచి తేలేదు ,మీరు గుర్తించి మా శ్రీకాకుళం గురుంచి చాలాబాగా రాసారు, దేవాలయాలు గురుంచి అలాగే ఉద్దానం ప్రక్రుతి గురుంచి మరియు తిత్లీ తూఫాన్ గురుంచి రాసారు ఈ తూఫాన్ వలన చాలామంది నిరాశులు అయ్యరు చాలా ఆస్తి నష్టం జరిగింది చాల థాంక్స్ మ్యడం మాకు గుర్తించినందుకు .
    ఫ్రెండ్స్ ఇంకా ఎవరు అయినా తూఫాన్ భాదితులికి హెప్ల్ చేయాలి అనుకుంటే హెల్ప్ చేయండి .

    ReplyDelete
  2. చూడని చక్కటి ప్రదేశాలు కూడాచూస్తున్నట్టు వుంది చదువుతుంటే ..

    ReplyDelete